హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము విద్యార్థులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలను రాష్ట్రపతి సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మరవొద్దని, గ్రామం, ఏజెన్సీ నుంచి వచ్చామనే ఆత్మనూన్యతనూ రానీయొద్దని, సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని చెప్పారు. రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని, వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని, భారత్లో జనాభాకు, అమెరికాలో జనాభాకు చాలా వ్యత్యాసం ఉన్నదని వివరించారు. భారత్లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలో లేవని గుర్తు చేశారు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు నేర్పించాలని ఉద్బోధించారు.
ప్రధానమంత్రివి అయితే ఏం చేస్తావని వరుణ్ అనే ఒక విద్యార్థిని రాష్ట్రపతి అడిగారు. దీనికి ఆ విద్యార్థి బదులిస్తూ తాను ఒకవేళ ప్రధానమంత్రిని అయితే ఈ దేశాన్ని సంస్కారంతో నింపే ప్రయత్నం చేస్తానని, మన కళలు, సంస్కృతి, సంగీతం వంటివి పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. తొలుత కేశవ్ మెమోరియల్లో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను రాష్ట్రపతి సందర్శించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు అమూల్యమని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కొనియాడారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న అధికారులతో సమావేశమయ్యారు. పోలీసులకు అప్రమత్తత, నిజాయితీ, సున్నితత్వం అవసరమని పేర్కొన్నారు. పీడితులు, బలహీనవర్గాలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు. దేశంలో మహిళా ఓటర్ల శాతం పెరగడం భారత ప్రజాస్వామ్యం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. స్త్రీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. నార్వే, స్వీడన్, డెన్మార్, బ్రిటన్ దేశాల్లోని పోలీసుల్లో 30 శాతం మంది మహిళలే ఉంటారని, ఆ దేశాలు మానవాభివృద్ధి సూచికల్లోనూ మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేశారు. మహిళా పోలీసు అధికారులు దుర్భర పరిస్థితుల్లో ఉన్న తోటి స్త్రీలకు సాయపడాలని సూచించారు. అప్పుడే సమాజంలో గొప్ప మార్పు కనిపిస్తుందని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి మిధానీలోని వైడ్ ప్లేట్ మిల్ని ప్రారంభించారు. అకడి విశేషాలను మిధానీ సీఎండీ సంజయ్కుమార్ఝాను అడిగి తెలుసుకున్నారు.