Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి.. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరెలను తయారీని పరిశీలించారు.
చేనేత స్టాళ్ల ఏర్పాటు
బాలాజీ ఫంక్షన్ హాలు వద్ద ఫంక్షన్ హాల్ వద్ద తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా థీమ్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్లో చేనేతకు సంబంధించిన వివిధ స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చపేట, నారాయణపేట, గద్వాల చీరెలు, సిద్దిపేట గొల్లబామ చీరెలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే చేనేత మగ్గం నేసే విధానం, చీరెల తయారీతోపాటు చరఖాను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తిగా తిలకరించారు.
ఎంపిక చేసిన వారికే అనుమతి..
ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీరంజన్ సిల్క్ సెంటర్ను రాష్ట్రపతి సందర్శిస్తారు. ఇందులోనే దారం తయారీ నుంచి వస్త్రం తయారీ ప్రక్రియ ఉంటుంది. పట్టుగూళ్ల నుంచి పట్టు తీయడం, ఆసు పోయడం, రంగులు అద్దడం, చిటికి తిప్పడం, చీరెలు నేయడం తదితర వాటిని అడిగి తెలుసుకుంటారు. చివరగా బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. ఫంక్షన్ హాల్లో సుమారు 400మందికే అనుమతిచ్చారు. కేవలం పాస్లు ఉన్నవారినే లోపలికి పంపించనున్నారు. వేదికపై రాష్ట్రపతి ముర్ముతోపాటు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అధికారులు ఉంటారు. రాష్ట్రపతి ఇక్కడే చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పద్మశ్రీ, సంత్కబీర్, జాతీయ అవార్డు గ్రహీతలతో మాట్లాడతారు. అంతేకాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించగా, అందులో ఎంపిక చేసిన ఐదు నుంచి పది మంది రాష్ట్రపతితో ముచ్చటిస్తారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.