హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): శీతాకాల విడిది కోసం ఈ నెల 26న హైదరాబాద్కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. 26 నుంచి 30 వరకు ఐదురోజులపాటు వరంగల్ జిల్లా రామప్ప, భద్రాచలం ఆలయాలను సందర్శిస్తారని, రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో రామచంద్ర మహారాజ్ 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం సీఎస్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటనకు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని, రాష్ట్రప్రతి ప్రయాణించే మార్గాల్లో రోడ్డు మరమ్మతులు, బారికేడింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ రామచంద్ర మహారాజ్ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉన్నదని, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.