యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందిచంగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తర్వాత యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. కాగా, యాదగిరిగుట్టను సందర్శించిన ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.