గద్వాల, ఆగస్టు 25 : కోర్టును తప్పుదోవ పట్టించి, తనపై తప్పుడు కేసు పెట్టిన మాజీ ఎమ్మెల్యే డీకే అరుణపై పరువు నష్టం దావా వేస్తానని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో తాను సమర్పించిన అఫిడవిట్లో నాలుగు అంశాలు పొందుపర్చలేదని అరుణ కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. కేసు వేసిన దాంట్లో ఒకటి కూడా నిజం లేదని అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈవీఎంలో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్కే పడుతుందని అరుణ ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పదవి లేక ఆమెకు పిచ్చిపట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనుమానం ఉంటే సాంకేతిక నిపుణులతో ఈవీఎంలను పరీక్ష చేయించుకోవాలని సూచించారు. పూడూరు శివారులో తనకు 24 ఎకరాలు భూమి ఉన్నదని, దాన్ని ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చలేదని అరుణ కోర్టుకు నివేదించిందని, అయితే ఆ పొలం 2018 సెప్టెంబర్14న ఇతరులకు విక్రయించానని, అది తన ఆస్తి కానప్పుడు అఫిడవిట్లో ఎలా చూపిస్తానని ప్రశ్నించారు. తన కార్లపై చలాన్లు ఉన్నా అవి కట్టకుండా అఫిడవిట్లో పేర్కొనలేదని కోర్టుకెళ్లిందని తెలిపారు.
ఆ వాహనాల్లో ఒకటి 2016 ఏప్రిల్ 26న సురేశ్ అనే వ్యక్తికి, మరో వాహనాన్ని 2018 ఏప్రిల్ 30న ఆదేశ్బాబు అనే వ్యక్తికి విక్రయించినట్టు చెప్పారు. బ్యాంక్లోని రెండు ఖాతాలు మార్చిలో రద్దు చేసుకున్నానని, మరో రెండు ఖాతాలు మనుగడలో లేవని వివరించారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకోలేక దొడ్డిదారిన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు విమర్శించారు. న్యాయస్థానాలపై గౌరవం ఉన్నదని, 20 ఏండ్లుగా తమను వేధింపులకు గురిచేస్తున్నా ఓర్పుతో ఉన్నానని, ఇకపై సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. అరుణ గద్వాలకు టూరిస్ట్ నాయకురాలని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు పెట్టడంకాదు.. అభివృద్ధిలో తనతో పోటీ పడాలని హితవు పలికారు.