Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని దేవాలయాన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలం తిర్మలాయపల్లెలోని లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపన, యాగం తదితర కార్యక్రమాలు జరిగాయి. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉష దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాంచారి, మడూరు, సన్నూరు, పాలకుర్తి, బమ్మెర, వల్మీడి తదితర గ్రామాల్లోని ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకుస్తున్నామన్నారు. తరతరాలకు తరగని ఆధ్యాత్మిక క్షేత్రంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం విలసిల్లుతుందని తాను నమ్ముతున్నానన్నారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా చందాలు వేసి ఆలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపా కటాక్షాలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాలతో హాయిగా ఉండాలని, కేసీఆర్ పరిపాలన సుదీర్ఘంగా సాగాలని కోరుకున్నారు. అంతకు ముందు త్రిదండి చినజీయర్ స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. దేవుడిని చూడాలంటే మనసు తెరవాలని, మన పాపాలు పోగొట్టి, పుణ్యాలు కలిగించే వాడే దేవుడన్నారు. దేవుడు అందరి వాడని, ఆయన ముందు అందరూ సమానమేనన్నారు. తెలంగాణలో దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని, దేవుళ్ల పూజలు ఎంత ఎక్కువ జరిగితే ఆ ప్రాంతం అంత ఎక్కువగా విస్తరిస్తుందన్నారు.
మనకు కావాల్సింది దేవుడి కృప, అనుగ్రహం అన్నారు. దైవ సన్నిధి మనకు ఆనందాన్ని పంచుతుందన్నారు. ఆలయాన్ని కట్టడమే కాకుండా, ఇక్కడ పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు, దైవిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూడాలని గ్రామస్తులకు సూచించారు. రోజుకు కొందరు బాధ్యత తీసుకోవాలని, ఇంత చిన్న గ్రామం ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకోవడాన్ని అభినందించారు.
గ్రామంలో దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.