హైదరాబాద్ : ఓజోన్ పొర భూమిని కాపాడుతోందని.. వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న దీన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్ పొర ప్రాధాన్యతను మంత్రి గుర్తు చేశారు.
మానవులు సుఖశాంతులతో ప్రశాంతంగా బతకాలంటే పర్యావరణ సమతౌల్యంతోనే అది సాధ్యమవుతుందని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భూమిపై జీవ పరిరక్షణకు అంతర్జాతీయ సహకారం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఓజోన్ రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, అందుకే సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కాలుష్య నియంత్రణ మండలి, శాస్త్ర, సాంకేతిక మండలి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.