హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): అడవులను రక్షించడం ద్వారా అంతరించిపోతున్న మొక్కలు, వన్యప్రాణులను సంరక్షించుకోవచ్చని నాబార్డ్ ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల పేర్కొన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్ల వారంరోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈపీటీఆర్ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుశీల చింతల హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ, అంతరించిపోతున్న మొక్కలు, వన్యప్రాణి జాతులను సంరక్షించేందుకు మొక్కల వర్గీకరణ, పరిమాణీకరణ పద్ధతులు ఉపయోగపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం స్వాతి తివారీ, నాబార్డ్ డీజీఎం సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.