సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఉచిత కోచింగ్ కేంద్రం సందర్శన
కరీమాబాద్, మే 29 : నిబద్ధతతో, ప్రణాళిక ప్రకారం చదివితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగార్థులకు సూచించారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మామునూరులోని పీటీసీలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకొనే యువత ప్రజా సేవ చేసేందుకు వస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగం పొందాలనుకొనే ప్రతి ఒక్కరూ అవినీతి రహిత సమాజం కోసం పని చేయాల్సి ఉంటుందని సూచించారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనేక విషయాలపై పట్టు సాధిస్తేనే కొలువు దక్కుతుందని చెప్పారు. అవినీతి రహిత సమాజం ఏర్పాటులో యువత ముందుండాలని కోరారు. ఉచిత కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వందలాది మంది అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన కోచింగ్ను అందిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ను అభినందించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో యువత కోసం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నామన్నారు. దీన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.