తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది గర్బిణీలను చీర, సారెలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు సత్కరించారు. అనంతరం వారినుద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. వెనుకటికి మంత్రసానులు ప్రసవాలు చేసేవారు. అయితే, మారిన ఆధునిక కాలంతో పాటు ప్రసవాలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడన్నీసిజేరియన్లు అవుతున్నాయి. దీని వల్ల చిన్న వయసులోనే తల్లులు అయిన వారంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గర్భ సంచీలు తీసివేయాల్సి రావడం, పీరియడ్స్ లో తేడాలు, వెన్ను నొప్పులు వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే… గర్భిణీలు కచ్చితంగా సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ముందు నుంచే తగు జాగ్రత్తలు, ఎక్సర్ సైజులు చేస్తే, సుఖ ప్రసవాలు జరుగుతాయని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నారని మంత్రి అన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే గర్బిణీలు సైతం కొంత బాధలు భరించైనా సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు చీరె, సారెలు పెట్టారు. వారిని సత్కరించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు, ప్రసవాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, వందేమాతరం ఫౌండేషన్ తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, అనేక మంది మహిళలు, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.