పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 30: పెద్దపల్లి రైల్వేస్టేషన్లో గర్భిణీ ప్రసవించింది. బెంగళూర్ నుంచి బెనారస్కు యశ్వంత్పూర్-దానాపూర్ స్పెషల్ ట్రైన్లో అనితాదేవి, సోదరుడు వినయ్కుమార్, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో పురిటి నొప్పులు రావడంతో వెంటనే ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఆపారు.
అప్పటికే సమాచారం అందుకున్న 108 సిబ్బంది గర్భిణీని వాహనంలోకి తీసుకెళ్లారు. పురిటి నొప్పులు అధికం కావడంతో సిబ్బంది ఆ వాహనంలోనే పురుడు పోశారు. అనితాదేవి మగ బిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈఎంటీ బాలు, పైలెట్ సురేశ్ తెలిపారు. అనంతరం తల్లీబిడ్డను పెద్దపల్లి మతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.