హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ నాటికే చలికాలం మొదలై పొగమంచు కురిసేది. చలిలో గజగజ వణుకుతూ వెళ్లి పువ్వు తెంపుకొచ్చేది. దీపావళికి చలి జోరు పెరిగి చలి మంటలు మొదలయ్యేవి. ఇక కార్తీక పౌర్ణమికి వేకువజామున లేచి స్నానం చేయాలన్న ఆలోచనకే వణుకు పుట్టేది. కానీ ఈసారి వాతావరణం పూర్తి భిన్నంగా ఉన్నది. దసరాకు చలి మొదలు కాలేదు. కార్తీక పౌర్ణమి దాటినా పెద్దగా పొగమంచు లేదు. ఎందుకిలా? జూన్లో వర్షాలు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఈ ఏడాది జూన్లో నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే నెలలో యూపీ, బీహార్ వంటి రాష్ర్టాల్లో వడదెబ్బకు రెండు, మూడు రోజుల్లోనే 100 మంది వరకు మరణించారు.
ఇదే సమయంలో ఈ ఏడాది జూలైలో ములుగు జిల్లాలో 24 గంటల్లోనే 64.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని కుండపోత ఇది. ఈ ఏడాది దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనిపించాయి. అకాల వర్షాలు, వరదలు, వానకాలంలో వడగాడ్పులు, వర్షాలు కురవాల్సిన సమయంలో కరువు పరిస్థితులు, చలికాలంలో ఉక్కపోతలు.. ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీంటికీ మూలం పర్యావరణ మార్పులే. దేశంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి వాతావరణ మార్పులు ఇబ్బంది పెడుతూనే ఉన్నట్టు డౌన్ టు ఎర్త్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. తొమ్మిది నెలల్లో 273 రోజులకుగానూ 235 రోజులు దేశంలో కల్లోల పరిస్థితులు నమోదైనట్టు పేర్కొన్నది.
ఈ లెక్కన 86 శాతం రోజులు ప్రతికూల వాతావరణమే కనిపించింది. అంటే.. దాదాపు ప్రతిరోజు దేశంలో ఏదో ఒక చోట వాతావరణ మార్పులు ప్రభావం చూపాయి. రోజుకు సగటున 10 మంది మరణించారని నివేదిక చెప్తున్నది. రాష్ర్టాల వారీగా పరిశీలించినప్పుడు వాతావరణ మార్పుల ప్రభావం మధ్యప్రదేశ్పై ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అక్కడ ఏకంగా 138 రోజులపాటు ప్రతికూల పరిస్థితులు నమోదయ్యాయి. ఇక దేశంలోనే అత్యధికంగా బీహార్లో 642 మరణాలు సంభవించాయి. హిమాచల్ప్రదేశ్లో అత్యధిక ఇండ్లు (15,407) ధ్వంసం కాగా, పంజాబ్లో అత్యధికంగా జంతువులు (63,649) మృత్యువాతపడ్డాయి.
జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య తెలంగాణలో 52 రోజులపాటు కల్లోల పరిస్థితులు నెలకొన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్లో అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాల కారణంగా సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఆ నెలలో దేశవ్యాప్తంగా 5,772 ఎకరాల్లో పంట నష్టం నమోదవగా.. తెలంగాణలోనే 87 శాతం ఉండటం గమనార్హం.