హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తమకు 39 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం (టీఈఈఏ) ప్రతినిధులు పీఆర్సీ నెగోషియేషన్ కమిటీకి విన్నవించారు. గురువారం విద్యుత్తు సౌధలో పీఆర్సీ నెగోషియేషన్ కమిటీ చైర్మన్ సీ శ్రీనివాసరావు, సభ్యులు టీఆర్కే రావు, కన్వీనర్ శ్రీనివాస్ను టీఈఈఏ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
39 శాతం పీఆర్సీతోపాటు సర్వీస్ వెయిటేజీ 0-4 ఇవ్వాలని, ఇంజినీర్లకు ప్రత్యేకంగా టెక్నికల్ గ్రేడ్ పే ఇవ్వాలని, కోహ్లీ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రావాల్సిన హెచ్ఆర్ఏ ఇవ్వాలని, గ్రాట్యుటీ, అలవెన్సులు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల వైద్య ఖర్చులను కంపెనీ భరించాలని, ప్రతి ఇంజినీర్కు రూ.కోటి టర్మ్ పాలసీ చేయించాలని, ప్రతి నాలుగేండ్లకు కల్పించే ఎల్టీసీ విషయంలో దేశవ్యాప్తంగా టూర్ వెళ్లేలా లేకపోతే ఏకమొత్తంగా ఇవ్వాలని విన్నవించారు. దీంతోపాటు పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. ఈ భేటీలో టీఈఈఏ ప్రతినిధులు శివాజీ, రామేశ్వరయ్యశెట్టి, విజయ్కుమార్, శ్రవణ్కుమార్గుప్తా, రాజేశ్, నర్సింహారెడ్డి, లక్ష్మయ్య, ప్రవీణ్కుమార్, వెంకట్రామయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.