తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగులకు పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ మూడు నెలల క్రితమే క్లియరెన్స్ ఇచ్చింది. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. పెరగనున్న పీఆర్సీ 2021 జూన్ 1వ తేదీ నుంచి వర్తించనుంది.
తెలంగాణ సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పే స్కేలు మీద 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల పేస్కేలు24,514 ఉండగా.. నూతన పీఆర్సీ ప్రకారం జీతభత్యాలు ఒక్కొక్కరికీ 7,300 మేర పెరగనున్నాయి.