ఖమ్మం, ఫిబ్రవరి 9: ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) ఏర్పడి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలో మహాసభలను నిర్వహిస్తున్నట్టు ఆ వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత, జాతీయ కార్యదర్శి కేఎస్ మల్లీశ్వరి తెలిపారు. శుక్రవారం స్థానిక హార్వెస్ట్ పాఠశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రచయిత్రులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకే ప్ర.ర.వే ఏర్పాటు చేశామని తెలిపారు.
మహాసభలకు దాదాపు 200 మంది సాహితీవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు హాజరవుతున్నారని పేర్కొన్నారు. వీరంతా ప్రస్తుత సమాజాన్ని కలవర పెడుతున్న ‘మహిళలపై ట్రోలింగ్’ అనే అంశంపై మాట్లాడతారని తెలిపారు. దేశంలో నెలకొన్న కుల, మతతత్వ విద్వేషాలు, అప్రజాస్వామిక ధోరణులపై చర్చిస్తారని చెప్పారు. సమాజంలో ఏ చెడు ధోరణి ఏర్పడినా, ముందుగా దాని ప్రభావం మహిళలు, ఎస్సీ, మైనార్టీ వర్గాలపైనే ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ సమస్యలను సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకోవడానికే తమ వేదిక మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శని, ఆదివారాల్లో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.