హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో తనను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ దుగ్యాల ప్రణీతకుమార్ అలియాస్ ప్రణీత్రావు హైకోర్టును కోరారు. వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు తనను పోలీస్ కస్టడీకి అప్పగించిందని, నిర్ధిష్టమైన షరతులేమీ విధించకుండానే కస్టడీ ఉత్తర్వులు జారీచేసిందని వివరిస్తూ మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్పష్టమైన గడువు నిర్ణయించకుండా పోలీస్ కస్టడీకి ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు.
కస్టడీ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని, సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయలేదని తెలిపారు. వాస్తవానికి ఈ నెల 18 (సోమవారం) నుంచి తనను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సి ఉన్నప్పటికీ కింది కోర్టు 17 నుంచే కస్టడీకి అనుమతించిందని వివరించారు. రహస్యమంటూ పోలీసులు తనను బంజారాహిల్స్ స్టేషన్లో విచారిస్తున్నారని, ఈ విచారణకు తన బంధువులను, న్యాయవాదిని అనుమతించడం లేదని, దర్యాప్తు అంశాలను ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసుల కస్టడీ, దర్యాప్తు నిర్ధిష్ట ప్రదేశంలో జరిగేలా చూడాలని, రోజూ పోలీసుల విచారణ పూర్తవగానే తనను తిరిగి జైలుకు తరలించేలా ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటరాగేషన్లో ఏఎస్పీ డీ రమేశ్ పాల్గొనకుండా కట్టడి చేయాలని కోరారు. దీంతో ఈ అత్యవసర పిటిషన్పై వివరణ ఇవ్వాలని జస్టిస్ జీ రాధారాణి పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.