రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో పల్లెలు కొత్తరూపు సంతరించుకొంటున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన ‘గ్రామజ్యోతి’ గ్రామాల ముఖరూపం మార్చేసింది. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని సమస్యలను పరిష్కరించారు. విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ దత్తత తీసుకొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి దశ తిరిగింది. సకల వసతుల కల్పనకు కృషి చేస్తుండటంతో గ్రామం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది.
అభివృద్ధి పరుగులు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ప్రకాశ్రాజ్ 2015లో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నారు. ప్రతినెల గ్రామస్థులతో సమావేశమవుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. గ్రామంలో ప్రధాన సమస్య అయిన తాగు నీటి ఎద్దడిని తీర్చేందుకు 6 బోరుబావులను తవ్వించారు. బోర్లన్నింటినీ అనుసంధానం చేసి ఓవర్హెడ్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా చేసి ప్రజల దాహార్తి తీర్చారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్నత పాఠశాల కోసం భవనంతోపాటు రూ.6 లక్షలతో అదనపు తరగతి గదులను నిర్మించారు. రూ.2 లక్షలతో బస్షెల్టర్ను నిర్మించారు. నిలువ నీడలేని ఓ నిరుపేద ముస్లిం కుటుంబానికి రూ.5 లక్షలతో ఇంటిని నిర్మించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం గ్రామంలోతరచూ వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. సొంత ఖర్చులతో ఆరుగురికి శస్త్రచికిత్స చేయించి వారి జీవితాలను కాపాడారు.
ప్రకాశ్రాజ్ ఆర్థిక సాయంతో గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకొన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కూడా గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులను మంజూరు చేస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, పల్లెప్రకృతి వనం, సీసీ రోడ్లను నిర్మించారు. హరితహారంలో ఏటా నాటుతున్న మొక్కలతో గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పరుచుకొన్నది.
ప్రకాశ్రాజ్ను మా గ్రామం ఎన్నటికీ మరచిపోదు
మా గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీనటుడు ప్రకాశ్రాజ్ను ఎప్పటికీ మర్చిపోం. గ్రామంలో తిష్టవేసిన అనేక సమస్యలను తొలగించారు. సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాలలో తరగతి గదులు లేక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థుల కోసం అదనంగా మూడు గదులను నిర్మించారు. గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించి, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించి ప్రాణాలను కాపాడారు.
– కంచుకోట దశరథ్, గ్రామస్థుడు
ప్రకాశ్రాజ్కు కేటీఆర్ ప్రశంస
నటుడు ప్రకాశ్రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లిని అద్భుతంగా అభివృద్ధి చేశారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు మంగళవారం ట్విట్టర్లో ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి అభినందించారు.