హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన (Prajapalana) దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు కోటి 8 లక్షలకుపైగా (1,08,94,115) దరఖాస్తులు అందాయి. శుక్రవారం ఒక్కరోజే 18,29,274 మంది అభయహస్తం దరఖాస్తులు సమర్పించారు. నేడు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కాగా, దరఖాస్తుల గడువు పెంచేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా దరఖాస్తు చేసుకోనివాళ్లు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడుపోతే మళ్లీ నాలులు నెలల తర్వాత గానీ అవకాశం రాదని తెలిపారు. ఇక ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను ఈనెల 17వ తేదీలోపు కంప్యూటరీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.