Cyber Crime | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన దరఖాస్తుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారులమని నమ్మబలుకుతూ.. దరఖాస్తులో తప్పులున్నాయని కాల్స్ చేస్తున్నారు. అనంతరం వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తెలుసుకుని డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో బాధిత మహిళ దాదాపు రూ.లక్ష వరకు నష్టపోయింది. ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో వారికి 6 గ్యారెంటీలను ఆశచూపి దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చుకున్నారని, ఈ తరహా నేరాలపై రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
‘మీరు 6 గ్యారెంటీలకు అర్హత సాధించారు. వెంటనే మీ పేరు, రశీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పండి. మీకు 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నట్టు నిర్ధారిస్తూ ఓ లింకును పంపాము. దానిని క్లిక్ చేసి, మీ ఫోన్కు వచ్చే ఓటీపీ చెప్పండి’ అంటూ ఎవరైనా కాల్ చేస్తే ఎలాంటి వివరాలను చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట కాల్స్ చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని చెప్తున్నారు. దరఖాస్తు చేస్తున్న 6 గ్యారెంటీల్లో ఎవరు ఎన్నింటికి అర్హత సాధించారనే విషయాన్ని నేరుగా ప్రజాపాలన వెబ్సైట్లో లేదా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు, పంచాయతీ, వార్డు అధికారులే తెలియజేస్తారని వివరిస్తున్నారు. కేటుగాళ్ల మాయమాటలను నమ్మి వారు అడిగిన వివరాలను చెప్తే బ్యాంకు ఖాతాలోని నగదును పూర్తిగా దోచేస్తారని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా https:// cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.