సోమవారం ఓ ప్రైవేటువ్యక్తి ప్రజాపాలన దరఖాస్తులు తరలిస్తుంటే బాలానగర్ ఫ్లైఓవర్పై పడి దరఖాస్తులు చెల్లాచెదురు అయిన ఉదంతాన్ని మర్చిపోకముందే మంగళవారం కుత్బుల్లాపూర్లోనూ అలాంటి ఘటనే జరిగింది. అధికారులు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు చెరో 200 దరఖాస్తులు ఇచ్చి పంపడం కలకలం రేపింది. అతడు దరఖాస్తులను పట్టుకెళ్లడం చూసి వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని ప్రశ్నిస్తే అప్లికేషన్లను ఆన్లైన్ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు.
సర్కారుకు అప్పగించిన అభయహస్తం దరఖాస్తులు నడిరోడ్డుపై ప్రత్యక్షమవడం చిన్న విషయం కాదు. పౌరుల వ్యక్తిగత సమాచారం బజారుపాలైనట్టే! ముక్కూమొహం తెలియని ప్రైవేటు వ్యక్తుల చేతికి 1.25 కోట్ల మంది ఆధార్ నంబర్లు, రేషన్కార్డు డాటా, మహిళల ఫొటోలు, ఫోన్నంబర్లు దొరుకుతుంటే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఎక్కడున్నట్టు? పౌరుల డాటాకు ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ ఏది?
హైదరాబాద్ : భవిష్యత్తులో భూములు, బంగారం కాదు.. డాటా (వ్యక్తిగత సమాచారం) అనేది వీటికంటే అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు చెప్తున్న మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు. అందుకే వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంపిణీ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పదేపదే సూచిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు చిన్న ఏమరపాటును అదునుగా చేసుకొని వ్యక్తిగత డాటా ఆధారంగా కేవలం ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజూ రూ.2 కోట్ల విలువైన సొ మ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వమే ప్రజల వ్యక్తిగత వివరాలను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. బయటికొస్తున్న ఘటనలు కొన్నే అయినా తెలియకుండా ఇంకెంత గందరగోళం జరుగుతున్నదోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన ప్రభుత్వం.. వాటిని కంప్యూటరీకరించడంలో ఎలాంటి విధి విధానాలను జారీ చేయలేదు. చివరకు జీహెచ్ఎంసీ సైతం ఇదే బాటలో నడవడంతో ఒక్కో జోన్లో ఒక్కో రీతిన ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ 3,500 మంది డా టా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చింది. హయత్నగర్ సర్కిల్కు వచ్చిన 83,563 దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు 122 మంది ఆపరేటర్లను కేటాయించారు. కూకట్పల్లిలో ఉన్న ధర్మేందర్ ఏజెన్సీకి దరఖాస్తులను పంపడమెందుకు? పైగా వాటిని ర్యాపిడోకు ఇచ్చి తరలించారంటే అధికారుల నిర్లక్ష్యం ఏస్థాయి లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గాలికిపోయిన దరఖాస్తులన్నీ తమకు చేరాయని అధికారులు ప్రకటిస్తున్నా.. దీనిని ధ్రువీకరించేదెవరు? కుత్బుల్లాపూర్ పరిధిలోనూ మంగళవారం బయటికొచ్చిన వీడియోలు అందరినీ మరింత విస్మయానికి గురిచేశాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు, విద్యార్థులు సర్కిల్ కార్యాలయం నుంచి వంద చొప్పున దరఖాస్తులను కట్టలు కట్టుకొని తమ ఇండ్లకు తీసుకుపోతున్న దృ శ్యాలు కనిపించాయి. ఇదేమంటే తాము ఇంట్లోనే కంప్యూటరీకరిస్తున్నట్టు వారు సమాధానమిచ్చారు. ఇలా ఒక్కో జోన్ పరిధిలో ఒ క్కో విధంగా కంప్యూటరీకరణ ప్రక్రియ జరుగుతున్నది. పైగా కొన్నిచోట్ల కాలేజీ విద్యార్థులకు ఇస్తే వారు తమ ఫోన్లలోనే వివరాలను నమోదు చేస్తుండటం గమనార్హం.
డాటా ఎంట్రీ కోసం టీఎస్టీఎస్కు లేఖ రాసి.. వారు సూచించిన 9 ఏజెన్సీలను నియమించుకొని పారదర్శకంగా దరఖాస్తు వివరాలను అప్లోడ్ చేస్తున్నామని కమిషనర్ రొనా ల్డ్ రోస్ చెప్తున్నారు. ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటరీకరిస్తున్న ట్టు ప్రకటించారు. కార్యాలయాల్లో తమ వివరాలు కంప్యూటర్లో నమోదవుతున్నాయని లబ్ధిదారులు ఆశించారు. కానీ.. డిప్యూటీ కమిషనర్ రవీందర్కుమార్ పరిధి దాటి ఏ ఆదేశాల మేరకు హయత్నగర్ సర్కిల్ దరఖాస్తులను కూకట్పల్లికి పంపించారో అన్న దానిపై సమాధానం చెప్పలేకపోతున్నారు. టీం లీడర్ ట్యాక్స్ వాల్యూయేషన్ ఆఫీసర్ ఎం. మహేందర్పై వేటు వేసి, అసలు కారణమైన డీసీ వ్యవహారంలో మాత్రం పట్టనట్టు ఉండటం విమర్శలకు తావిస్తున్నది. కుత్బుల్లాపూర్ సర్కిల్-25లో టీం లీడర్గా ఉన్న భార్గవ నారాయణకు నోటీసులతో సరిపెట్టారు. ఒకేరోజు వరుసగా అధికారులను బాధ్యులను చేసి వేటు వేస్తే ఎక్కడ తమ లోపాలు ఒప్పుకోవా ల్సి వస్తుందోనని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న చర్చ జరుగుతున్నది.
నిత్యం ప్రతి ఒక్కరికీ వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇలా అనేక వ్యాపార సంస్థల నుంచి ఫోన్లు వస్తుంటాయి. వారికి మన ఫోన్ నంబర్ ఎలా వెళ్లిందో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ క్రమంలో ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో కు టుంబంలోని అందరి ఆధార్ నంబర్లతోపాటు రేషన్ కార్డు వివరాలు, కరెంటు, గ్యాస్ బిల్లు లు అనేక వ్యక్తిగత వివరాలను సమర్పించారు. ఇంత సమాచారానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉంటుంది. మరి ఇది సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే పరిస్థితి ఏమిటని మంగళవారం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దరఖాస్తులు అత్యధిక శాతం మహిళల పేరు మీదనే ఉన్నాయి. ఇందుకోసం దరఖాస్తు వెంట పాస్పోర్టు సైజు ఫొటోలు కూడా అంటించారు. దీంతో సైబర్ నేరగాళ్ల చేతిల్లోకి ఇవిపోతే పరిస్థితి ఏమిటనేది కూడా అధికారులుగానీ, ప్రభుత్వంగానీ ఆలోచించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజాపాలనలో ప్రజలు సమర్పించిన దరఖాస్తుల్లోని వివరాలు సైబర్ నేరగాళ్లకు చిక్కితే పెనుప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దరఖాస్తుల్లో ప్రతి ఒక్కరూ ఆధార్కార్డు, రేషన్కార్డు జిరాక్స్లు పెట్టారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవి వెళ్తే ఆ వివరాలతో సిమ్కార్డులు తీసుకొని సైబర్ క్రైమ్ చేసే అవకా శం ఉంటుందని, ఓటీపీ ఆధారిత నేరా లు పెరిగే ప్రమాదం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. దరఖాస్తులు మహిళల పే ర్లతో సమర్పించడం.. వారి ఫొటోలతోపాటు ఫోన్ నంబర్లు పొందుపర్చడంతో వారు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
ప్రజా పాలన దరఖాస్తుల కంప్యూటరీకరణను కాంగ్రెస్ సర్కారు ప్రైవేట్ ఏజెన్సీల చేతిలో పెట్టింది. ఆరు గ్యారెంటీల కోసం ప్రజలు ఆధార్, రేషన్ కార్డులు, ఇతరత్రా డాక్యుమెంట్లతోసహా అప్లికేషన్ పెట్టుకుంటే అవి ఫ్లైఓవర్పై గాల్లో తేలాయి. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు నిన్నటివరకు నీతులు చెప్పిన వారి పాలనలో యథేచ్ఛగా తమ వ్యక్తిగత వివరాలు ఎవరి చేతుల్లో పడితే వారి చేతుల్లోకి వెళ్తున్నాయనే ఆందోళన ప్రజల్లో నెలకొన్నది. ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు బాధ్యులుగా ఓ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి, తమ తప్పు లేదన్నట్టు ప్రజలను నమ్మించాలని చూస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వాస్తవానికి కుటుంబ సభ్యులకు మనం వివరాలు ఇచ్చేందుకు కూడా ఇష్టపడం. అలాంటిది ఇప్పుడు ప్రైవేటు సం స్థల చేతుల్లోకి వివరాలు చేరిపోయాయి.
– ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలు
అప్లికేషన్లు చూసి ఫోన్లు చేస్తున్నారు జాగ్రత్త!
ప్రజాపాలన దరఖాస్తుల మాటున సైబర్ముప్పు పొంచి ఉన్నది. దరఖాస్తుల ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు. వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పొద్దు. దరఖాస్తుదారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఓటీపీలు రావు. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల
అప్రమత్తంగా ఉండాలి.
– సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన హెచ్చరిక ప్రకటన
సైబర్ నేరగాళ్లు ఇల్లు, పెన్షన్ ఇస్తే మంచిదేగా!
ఇల్లు లేనోళ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నరు. పెన్షన్ కావాలని అనుకున్నోళ్లు కూడా అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్నరు. సైబర్ నేరగాళ్లు అభయహస్తం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని అంటున్నరా? ఇబ్బందేం లేదు! పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? అలా ఇస్తే మంచిదే కదా!’
– ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
భట్టి మాటలు వింటే ఉన్న పైసల్ పోతయ్..
డిప్యూటీ సీఎం భట్టి మాటలు విని పొరపాటునైనా సైబర్ నేరగాళ్లకు మీ సమాచారం ఇవ్వకండి. ఓటీపీ, ఇతర బ్యాంకు వివరాలను సైబర్ నేరగాళ్లకు షేర్ చేయకండి. భట్టి మాటలు విని, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ప్రజల సున్నితమైన డాటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి.
– బీఆర్ఎస్ నేత కేటీఆర్