హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీతో జల విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణుల అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు పచ్చజెండా ఊపింది. అక్టోబర్ 11న రివర్ వ్యాలీ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణుల అప్రయిజల్ కమిటీ 35వ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనలు, సూచనలు (టీవోఆర్)పై చర్చించి.. ఆమోదించింది. సిద్ధార్థ్ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ (ఐ) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను పంపించింది.
ఐదు యూనిట్లుగా.. 1200 మెగావాట్లు..
ఎగువన ఉన్న రిజర్వాయర్ (0.678 టీఎంసీల సామర్థ్యం) నుంచి 7 మీటర్ల వ్యాసార్థంతో ఉన్న 4 పైపుల ద్వారా 700 మీటర్ల దూరం నీటిని దిగువ రిజర్వాయర్లోకి తరలిస్తారు. అక్కడ 3 పైపుల వద్ద 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఉన్న 3 యూనిట్లను, నాలుగో పైపును 4.9 మీటర్ల వ్యాసార్థంతో రెండు పైప్ లైన్లు వేస్తారు. ఒక్కో పైప్లైన్ చివరన 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లను ఏర్పాటు చేస్తారు. దీనితో మొత్తం ఐదు యూనిట్ల నుంచి 1,200 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతియేటా 2,592 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ విద్యుత్తును 400 కేవీ డబుల్ సర్క్యూట్ లైను ద్వారా 22 కి.మీ దూరంలో ఉన్న నిర్మల్ 400 కేవీ సబ్స్టేషన్కు అనుసంధానిస్తారు. దిగువ రిజర్వాయర్ నుంచి తిరిగి ఎగువ రిజర్వాయర్లోకి పంపింగ్ చేసేందుకు కావాల్సిన విద్యుత్తును ఈ సబ్స్టేషన్ నుంచే తీసుకొంటారు. ఇందుకు అనుగుణంగానే విద్యుత్తు జనరేటర్లు/పంపులను ఏర్పాటు చేస్తారు.
609 హెక్టార్ల భూమి అవసరం
రాణాపూర్ వద్ద నిర్మించాలనే ప్రతిపాదనల్లో తెలిపిన వివరాల ప్రకారం దీనికి 609.64 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 502.04 హెక్టార్ల భూమి అటవీస్థలం కాగా.. 107.60 హెక్టార్ల స్థలం అటవీయేతర భూమిగా పేర్కొన్నారు. పూర్తిస్థాయి డీపీఆర్ సిద్ధమైన తరువాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కవ్వాల్ టైగర్ రిజర్వ్కు 13.5 కి.మీ దూరంలో ఉన్నదని తెలిపారు. దీని నిర్మాణానికి రూ.6,614.15 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదనల్లో తెలిపారు.
మరింత అధ్యయనం..
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. అటవీ భూముల సేకరణను మరింత తగ్గించేలా మార్పులుచేసి, భూసేకరణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక సర్వే చేయాల్సి ఉంది. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అధ్యయనాలను కూడా పూర్తి చేసి.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయి అనుమతులు తీసుకొంటామనికూడా ఆప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నవంబర్ 15న జరిగిన ఈఏసీ 36 వ సమావేశంలో 35 వ సమావేశంలోని అజెండా అంశాలను అంగీకరించారు. అలాగే 1200 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు పాయింట్లకు సంబంధించిన సవరణలను కూడా నిపుణుల కమిటీ ఆమోదించింది.
రెండు రిజర్వాయర్ల నిర్మాణం
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం సరిహద్దుల్లో ఉన్న రాణాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ 1,200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మించనున్నట్టు సదరు కంపెనీ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నది. ఇందుకోసం రెండు రిజర్వాయర్లను నిర్మించాలని తెలిపింది. ఈ రిజర్వాయర్ను నింపేందుకు స్వర్ణ ప్రాజెక్టు నుంచిగానీ, శ్రీరాంసాగర్ నుంచి గానీ నీటిని తీసుకొనే వెసులుబాటును అందులో పొందుపర్చారు. ఈ రెండు రిజర్వాయర్ల వల్ల కేవలం ఆవిరిగా మారే నీటిని ఏడాదికి ఒకసారి మాత్రమే తీసుకొనే అవసరం ఉంటుందని అందులో పేర్కొన్నారు.