సూర్యాపేట టౌన్, మార్చి 19 : ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి.. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత మల్లు స్వరాజ్యం అని కొనియాడారు.
అసలు తెలంగాణను దేశానికి పరిచయం చేసింది సాయుధ పోరాటమేనని, అటువంటి పోరాటంలో నిజాం సర్కారు నుంచి విముక్తి కల్పించేందుకు తుపాకీ పట్టిన తొలి మహిళగా మల్లు స్వరాజ్యం చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వతీరును ఎండగట్టి ఎంతటి నాయకుడినైనా ఎదిరించి నిలదీసిన ధైర్యశాలిగా ప్రజలు, పేదల పక్షాన పోరాడిన మహా యోధురాలు అని చెప్పారు. మోదీ పాలనలో యువతలో నైరాశ్యం పెరిగిందని, చైతన్యం లోపించిందని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. గుజరాత్ మోడల్ అంటూ 2014 ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ భావజాలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశంలో దారిద్య్రాన్ని మరింత పెంచి పోషించిందని దుయ్యబట్టారు. దేశంలో 2014 వరకు 6.5 శాతం ఉన్న దారిద్య్రాన్ని 9 ఏండ్లుగా 8.5 శాతానికి పెంచిన చరిత్ర మోదీదని విమర్శించారు.
హక్కుల కోసం సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కోల్పోవడమే కాకుండా ఇష్ట దైవాన్ని కొలిచే పరిస్థితి లేకుండా చేసిన గుజరాత్ రాష్ట్ర పాలనను రోల్ మోడల్ అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలవంతంగా రుద్దుతున్నారని మంత్రి మండిపడ్డారు. మల్లు లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఎం సీనియర్ నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి ప్రమాదకారిగా మారిందని.. దీని నియంత్రణకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మోదీ ప్రభుత్వం ఫెడరలిజాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నదని విమర్శించారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే ఉద్దేశంతో, అవినీతి ఆరోపణలు రుద్దుతూ ఈడీ, సీబీఐ, ఐటీ వ్యవస్థలతో కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతి లేదా? అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ స్పందించడం లేదని ప్రశ్నించారు.