Minister Jagadish Reddy | సూర్యాపేట టౌన్, జూన్ 15: అమరుల కుటుంబాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొనియాడారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని, ఆయన పోరాటం అజరామరమని పేర్కొన్నారు. కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్ల నజరానా, గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్లో ఇంటి స్థలం ప్రకటించి కొండంత అండగా నిలిచారని కొనియాడారు. ఇతర రాష్ర్టాలకు చెందిన అమరుల కుటంబాలకు సైతం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నజరానా ప్రకటించి యావత్ దేశానికే కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
కర్నల్ సంతోష్బాబు 3వ వర్ధంతి సందర్భంగా గురువారం సూర్యాపేటలో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను ఆదుకొనే విషయంలో ప్రధాని మోదీ సర్కారు చిన్నచూపు చూసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం అక్కున చేర్చుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కర్నల్ సంతోష్బాబు కుటుంబసభ్యులతో కలిసి మంత్రి ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ బీరవోలు రవీంద్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.