సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 18 : ప్రజలకు విద్యుత్తు సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి గ్రామంలో గల శివాలయాల్లో మంత్రి జగదీశ్రెడ్డి దంపతులు పూజలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మోదీ సర్కార్ సంస్కరణల పేరిట అదానీ వంటి ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు ప్రజల డబ్బును దోచిపెడుతున్నదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చేది సంస్కరణలు కాదని, ప్రజలను పీల్చిపిప్పి చేసే నల్ల విద్యుత్తు చట్టాలని పేర్కొన్నారు. విద్యుత్తు విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్తును 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం, ఈఆర్సీ నిర్ణయంతో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రూ.50 వరకు అమ్ముకోవచ్చంటే ప్రజలను చీకట్లోకి నెట్టి దోపిడీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. దేశంలో సొంత బొగ్గు వనరులు ఉండగా విదేశీ బొగ్గు ఎందుకు తెస్తున్నదని ప్రశ్నించారు.
విదేశీ బొగ్గును అదానీ ద్వారా కేంద్రమే రాష్ర్టాలకు బలవంతంగా అమ్మిస్తున్నదని దుయ్యబట్టారు. అదానీకి లాభం చేకూర్చేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ విద్యుత్తు సంక్షోభం సృష్టించి ప్రజలకు ద్రోహం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అదానీ స్నేహ బంధం ప్రజలకు అర్థమవుతున్నదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.