హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కాంతులతో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతున్న వేళ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడుతున్నది. డిమాండ్కు సరిపడా విద్యుదుత్పత్తి లేకపోవడంతో పల్లెలు, పట్టణాల్లో రెండుమూడు రోజులుగా అనధికారిక కోతలు విధిస్తున్నట్టు తెలుస్తున్నది. పల్లెల్లో 4 నుంచి 5 గంటలు, పట్టణాల్లో 1-2 గంటలు కోతలు విధిస్తున్నట్టు సమాచారం. ఈ సీజన్లో అంతంతమాత్రం వర్షాలకు తోడు వ్యవసాయ అవసరాలు పెరగడంతో విద్యుత్తు వినియోగం అమాంతం పెరిగింది.
ఆ మేరకు విద్యుదుత్పత్తి లేకపోవడంతో కోతలు విధించకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు వారంలో ఒకరోజు అదనంగా పవర్ హాలిడే అమలు చేయాలని విద్యుత్తుశాఖ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. బల్క్డ్రగ్, ఆక్సిజన్ ప్లాంట్లు, ఫార్మాస్యూటికల్స్, రైస్ మిల్లులకు మాత్రం పవర్ హాలిడే నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తున్నది. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్తును పంపిణీ చేసేందుకు పరిశ్రమలకు పవర్ హాలిడే అమలుకు అనుమతించాలన్న విద్యుత్తు పంపిణీ సంస్థల విజ్ఞప్తికి ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. విద్యుత్తు కోతలతో అల్లాడుతున్న ప్రజలు, రైతులతోపాటు వ్యాపార, పారిశ్రామిక రంగానికి చెందినవారు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగుతున్నారు.