దేశంలో అత్యుత్తమ విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఇదే
99.99% కచ్చితత్వంతో నాణ్యమైన విద్యుత్తు సరఫరా
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ శ్రీకాంత్ అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 4 : తెలంగాణ ట్రాన్స్కో దేశంలోనే అత్యుత్తమ విద్యుత్తు సరఫరా వ్యవస్థను కలిగి ఉండి, చాలా చక్కగా పనిచేస్తున్నదని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) సీఎండీ కే శ్రీకాంత్ అభినందించారు. హైదరాబాద్కు వచ్చిన ఆయన.. సోమవారం విద్యుత్తుసౌధలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 99.99% కచ్చితత్వంతో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న టీఎస్ ట్రాన్స్కో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలోని 400 కేవీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు పీజీసీఐఎల్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
అటవీ శాఖ నుంచి సులభంగా అనుమతులు పొందేందుకు ట్రాన్స్మిషన్ టవర్ల ఎత్తును పెంచాలన్న టీఎస్ ట్రాన్స్కో సూచన బాగున్నదని, దీనిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. విద్యుత్తుసౌధలో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ), పీజీసీఐఎల్ ఏర్పాటు చేస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు. రూ.17.6 కోట్ల పూర్తి గ్రాంట్తో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్లో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో విద్యుత్తు అవసరాలను అంచనావేసి, తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో ట్రాన్స్కో జేఎండీ సీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు టీ జగత్రెడ్డి, బీ నర్సింగరావు తదితరులు
పాల్గొన్నారు.