హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో ప్రమోషన్లను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని విద్యుత్తు సౌధలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్తు సంస్థలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో తెలంగాణ ఆవిర్భావం తరువాత కల్పించిన అన్ని పదోన్నతులను హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించి నష్టపోయినవారికి ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
2009 తర్వాత నియామకం అయిన ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన నిర్ణయించి, ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న 3,500 మంది జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. నూతన వేతన సవరణ అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు సీఎండీ హామీ ఇచ్చారని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో చైర్మన్ ఆర్ సుధాకర్రెడ్డి, కో కన్వీనర్ సీ భానుప్రకాష్తోపాటు నాయకులు మారం శ్రీనివాస్, విజయకుమార్, యాదగిరి, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.