కోదాడ, సెప్టెంబర్ 20 : విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో బోరుబావుల కింద వేసిన పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పట్టించుకోవడంలేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ధ్వజమెత్తారు. ఆదివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కరివిరాల విద్యుత్తు సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదని మండిపడ్డారు.
విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక బోర్లు, బావుల కింద వేసుకున్న పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ మూడు పంటలకు నీళ్లు ఇచ్చి రైతును రాజును చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పంటలను ఎండబెట్టి అన్నదాతలను అగచాట్లపాలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి రైతులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.