హైదరాబాద్: రాష్ట్రంలో అకడమిక్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేవారికి ఇప్పుడు కరెంట్ కోతల (Power Cuts) భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో మండే ఎండలు, ఉక్కబోతతో పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది. మే 6న టీఎస్ఈసెట్, మే 7 నుంచి 11 వరకు ఎప్సెట్, మే 23న ఎడ్సెట్, జూన్ 3న లాసెట్, పీజీలాసెట్, జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరెంట్ కోతలు ఉండొద్దని విద్యుత్తుశాఖకు విద్యాశాఖ లేఖలు రాసింది. మరోవైపు, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర సమయంలో యూపీఎస్లను వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువసేపు కరెంట్పోతే ఇబ్బందులు ఎదురుకాకుండా జనరేటర్లను పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. జనరేటర్లు, యూపీఎస్లు ఉండే సెంటర్లకే పరీక్ష కేంద్రాలుగా అనుమతిస్తున్నారు. మరోవైపు, పరీక్షల నిర్వహణకు సహకరించాలని పోలీస్ శాఖకు, వీలైనన్నీ ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీకి విద్యాశాఖ లేఖ రాసింది.