హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): విద్యుత్త బిల్లుల జారీలో ఎలాంటి జాప్యం జరగడం లేదని.. పండుగలు, వరుస సెలవులు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాదని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది అవగాహన లేమితో అసత్య ప్రచారం చేస్తున్నారని, బిల్లుల జారీ అంతా సాఫ్ట్వేర్ ప్రకారమే జరుగుతున్నదని చెప్పారు.
‘విద్యుత్తు రీడింగ్ 31 నుంచి 35 రోజుల వరకు తీస్తుండటంతో వినియోగదారులపై అధికభారం పడుతున్నది. 30 రోజులకు రీడింగ్ తీయకపోవడం వల్ల స్లాబు మారి జేబుకు చిల్లులు పెడుతున్నారు’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంపై సీఎండీ స్పందించారు. వినియోగదారులు అసత్య ప్రచారాలను నమ్మొద్దని, బిల్లులో ఏవైనా సందేహాలుంటే సమీప విద్యుత్తు కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆదేశాల ప్రకారమే నడుచుకొంటున్నామని, బిల్లుల జారీలో శాస్త్రీయ/ప్రామాణిక పద్ధతి అవలంబిస్తున్నట్టు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.