జనగామ, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : పాలకుర్తి లోని చారిత్రక ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధిలో భాగంగా శివరాత్రి నాటికి పోతన క్షేత్రాన్ని సిద్ధం చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాకతీయుల కళా విశిష్టతకు పూర్వవైభవం తీసుకొచ్చి తెలంగాణ వారసత్వ సంపదను పరిరక్షిస్తామని మంత్రి తెలిపారు. శనివారం ఆయన పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఐదు చారిత్రక ఆలయాల అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఎండీ మనోహర్రావు, కలెక్టర్ శివలింగయ్య, చారిత్రక కట్టడాల నిపుణుడు పాండురంగారావు, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ, రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శివరాత్రి నాటికి కల్యాణ మండపం ప్రారంభిస్తామని, సోమనాథుడి ఆలయ ప్రాంగణంలో రూ.25 కోట్లతో 40 గదులతో టూరిజం హరిత హోటల్ నిర్మిస్తామని చెప్పారు. హరిత హోటల్కు స్థలం ఇచ్చే స్థానికులకు వేరేచోట ఇండ్లు, టూరిజం శాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చా రు. శివరాత్రి నాటికి మరిన్ని పనులు చేసి పోతన క్షే త్రాన్ని ప్రారంభిస్తామని, హోటల్ శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ను ఆహ్వానిస్తామ ని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆది కవి పాలురికి సోమనాథుడి విగ్రహ ప్రతిష్ఠకు రూ.5 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. బమ్మెరలో పోతనకు 2010లో 4 ఎకరాల 10 గుంటల స్థలం సేకరణకు తానే స్వయంగా రూ.లక్ష ఇచ్చానని, అదే ఇప్పుడు పునాది అయ్యిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు రూ.15 కోట్లు మంజూ రు చేశారని చెప్పారు. ఈ నిధులతో 22 అడుగుల విగ్రహం తయారవుతున్నదని, పోతన ఉన్న స్థలం, దున్నిన భూమి, నీళ్లు తోడిన బావి, ఆయన పూజించిన సరస్వతి మందిరాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన వివరించారు. చెన్నూరు త్రికూటాలయం కూడా చాలా ప్రసిద్ధమైనదని పేర్కొన్నారు. ఈ ఆలయ పునరుద్ధరణకు రూ.కోటి, గిరిజనుల ఆరాధ్యదైవం వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం, రోడ్డు అభివృద్ధి పనులకు రూ.1.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. విస్నూరులో స్థానిక రెడ్డి, వెలమలు కలిసి 800 ఏండ్ల కింద వేంకటేశ్వర స్వామి గుడి నిర్మించారని, అందులో శివాలయం కూడా ఉందని, వాటి అభివృద్ధికి రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి దయాకర్రావు వివరించారు.
పోతన వల్మిడి గుట్ట మీద కూర్చోని మహా కావ్యాన్ని రాసినట్టు సాక్ష్యాలు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ‘నేను చిన్నప్పుడు వల్మిడికి వచ్చి రాముడికి కల్యాణం చేయించే వాడిని. నా పెండ్లి కూడా ఇకడే జరిగింది’ అని మంత్రి గుర్తుచేసుకున్నారు. శ్రీరామనవమి రోజున ఇక్కడ జరిగే కల్యాణోత్సవానికి ప్రతి కుటుంబం నుంచి భార్యాభర్తలు రావాలని, ఒంటిమిట్ట, భద్రాద్రికి సమానంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.