హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని పుప్పాలగూడ(గండిపేట మండలం), ఖానామెట్(శేరిలింగంపల్లి మండలం) భూముల వేలం వాయిదా పడింది. ఈ నెల 27, 28 తేదీల్లో జరగాల్సిన వేలంను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ఐఐసీ స్పష్టం చేసింది. ఈ భూముల వేలంపై పలువురు ఆయా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాయిదాకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో భరోసా కలిగించేందుకు, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాతే వేలం ప్రక్రియ ఉంటుంది.
పుప్పాలగూడ, ఖానామెట్లో నిరూపయోగంగా ఉన్న 117.29 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ– వేలం పద్ధతిలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఈ ఏడాది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 41/14లోని 22.79 ఎకరాల విస్తీర్ణంలోని 9 ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో 325, 326, 327, 328 సర్వే నంబర్లలోని 94.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో 26 ప్లాట్లను కూడా వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.