హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవివాదం తొలగిపోవడంతో టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ కలిపి నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేశాయి. 2017లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో రేడియోగ్రాఫర్ల నియామకానికి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది. తమకు వెయిటేజీ కావాలని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల కేసును హైకోర్టు కొట్టివేసింది. దీంతో టీఎస్పీఎస్సీ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసింది., సోమవారం వైద్యారోగ్య శాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, 30 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు.