హైదరాబాద్, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్లకూ ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకు పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఆర్మీ వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. కొన్నేండ్లుగా అత్యవసర సర్వీసులు అందించే శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ ఉంది.
ఈ నేపథ్యంలో 13 శాఖల ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించారు. ఇందులో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ), భారతీయ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్, బీఎస్ఎన్ఎల్, మీడియా ప్రతినిధులు (ఈసీఐ గుర్తించిన వారు), ఫైర్ సర్వీసు ఉద్యోగులను గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అనువుగా శాఖకు ఎన్నికల సంఘానికి మధ్య ఒక నోడల్ అధికారిని నియమించనున్నారు. పోస్టల్ బ్యాలెట్కు అర్హులైన వారందరూ నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.