ఇండ్ల నిర్మాణాలకు, లేఅవుట్లకు సులభంగా అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ను ప్రజలకు మరింత సౌలభ్యంగా మార్చుతున్నది తెలంగాణ ప్రభుత్వం. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దేందుకు అవకాశం కల్పిస్తూ మార్పులు, చేర్పులు చేయనున్నది.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణాలు, లేఅవుట్లకు సులభంగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయనున్నది. ఇండ్ల యజమానులకు మరింత సౌలభ్యంగా ఉండేలా సంస్కరణలను తీసుకురానున్నది. దీనిలో భాగంగా బీపాస్ దరఖాస్తు సవరణ కోసం ఈ నెలాఖరులోగా కరెక్షన్ మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకురానున్నది.
దరఖాస్తులో పేర్కొన్న వివరాల్లో తప్పులేమైనా ఉంటే వాటిని సవరించుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. దీంతో పలు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరెక్షన్ మాడ్యూల్ను ప్రవేశపెట్టనున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనితోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ (ఎస్ఆర్వో) డాటాను టీఎస్బీపాస్, టీడీఆర్, రెరాతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే నంబర్ నమోదు చేయగానే ఎస్ఆర్వో డాటాలోని వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ ఆప్షన్ను మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.
1.20 లక్షల ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు
ఇండ్ల నిర్మాణ అనుమతుల్లో జాప్యానికి, అవినీతికి తావులేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 నవంబర్ 16 నుంచి టీఎస్బీపాస్ను అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఇండ్ల నిర్మాణదారులకు అనుమతులు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 1.70 లక్షల దరఖాస్తులు రాగా.. 1.20 లక్షల ఇండ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. వివిధ కారణాలతో 36 వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు వేర్వేరు దశల్లో ఉన్నాయి.