Bhatti Vikramarka | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా, కీలక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార శాఖ మార్పు అంశం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న ఆర్థిక శాఖను తప్పించడం ఖాయమనే సంకేతాల నడుమ, తెరవెనుక తీవ్రమైన చర్చలు, మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్గం భట్టి విక్రమారకు స్పీకర్ పదవిని అప్పగించడం ద్వారా ఆయనను ప్రస్తుత బాధ్యతల నుంచి, అసలు మంత్రివర్గం నుంచే తప్పించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వంలో మరింత పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే సీఎం వర్గం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని, భట్టిని శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే మంత్రివర్గంలో సమీకరణలు తమకు పూర్తిగా అనుకూలంగా మారుతాయని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, స్పీకర్ పదవిని చేపట్టేందుకు భట్టి విక్రమార్క ఏమాత్రం సముఖంగా లేనట్టు తెలుస్తున్నది. మంత్రిగా ఉంటూనే క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. స్పీకర్ పదవి ఇస్తే ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రజలకు కాస్త దూరం కావాల్సి వస్తుందనే ఉద్దేశంతో, మంత్రి పదవిని కాపాడుకొనేందుకు ఆయన తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
క్యాబినెట్లోకి గడ్డం ప్రసాద్?
భట్టి విక్రమార్కను పూర్తిగా క్యాబినెట్ నుంచి తప్పించి, తన వర్గంగా గుర్తింపు ఉన్న ఇద్దరు నేతలను చొప్పించడానికి ముఖ్యనేత వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్లాన్లో భాగంగా తనకు సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని ప్రతిపాదించినట్టు సమాచారం. గడ్డం ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన భట్టి స్థానాన్ని భర్తీ చేస్తారని, తద్వారా మాల సామాజిక వర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని రంగారెడ్డి జిల్లాకు కూడా స్థానం కల్పించినట్టు అవుతుందని ముఖ్యనేత యోచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సామాజికవర్గంతో నింపాల్సిన బెర్తును మాల సామాజిక వర్గం నేత (గడ్డం ప్రసాద్)తో నింపుతున్నారు కాబట్టి, ఆ కోటాను ఉపయోగించుకొని తనకు అత్యంత ఆప్తుడైన బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ సుదర్శన్రెడ్డికి సునాయాసంగా క్యాబినెట్ బెర్త్ ఇవ్వవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు టాక్. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దకుతుంది. అటు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నందున, భట్టిని తప్పించినా ప్రాంతీయ సమతుల్యత దెబ్బతినదని సీఎం వర్గం అంచనా వేస్తున్నది. కొత్తగా ఇద్దరు వస్తే క్యాబినెట్లో తమ నిర్ణయానికి ఇక తిరుగుండదని సీఎం వర్గం భావిస్తున్నది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అవుతుందని, తమకు ఎదురుచెప్పేవారే క్యాబినెట్లో ఉండరనే ధీమాతో ఉన్నది.
మరో శాఖ అయినా ఇవ్వండి!
పరిస్థితిని గమనించిన భట్టి .. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక శాఖను వదులుకొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. క్యాబినెట్ నుంచి తప్పుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి తప్పించినా పరవాలేదు కానీ, బదులుగా మరేదైనా శాఖను కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న భట్టి.. అధిష్ఠానం అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్టు తెలిసింది. అధిష్ఠానం సీఎం వర్గం వైపే మొ గ్గుచూపుతున్నదా? లేక భట్టిని బుజ్జగించి సర్దుబాటు చేస్తుందా? తేలాల్సి ఉన్నది.