యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నూతన హెలికాప్టర్కు ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున నూతనంగా ఓ హెలికాప్టర్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో యాదాద్రి టెంపుల్ సిటీలోని హెలిప్యాడ్ వద్ద నూతన హెలికాప్టర్కు శివాలయ ప్రధాన పురోహితుడు, అర్చకులు పూజలు చేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావుతో కలిసి ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు హెలికాప్టర్ వద్ద కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా వాహన పూజలు నిర్వహించారు.
ఎయిర్ బస్ కార్బురేటర్ 135 హెలికాప్టర్ 500 కిలోమీటర్ల రేంజ్, 20 వేల ఫీట్ల ఎత్తు వరకు ప్రయాణం చేస్తుందని ఫైలట్ కెప్టెన్ దీపక్ కులకర్ణి తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పూజలు నిర్వహించి హెలికాప్టర్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
గతంలో టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్కు మొదటిసారిగా యాదగిరిగుట్ట క్షేత్రంలో పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆ హెలికాప్టర్కు స్వామివారి పేరునే పెట్టారు. తాజాగా ప్రతిమ గ్రూప్స్, హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున కొనుగోలు చేసిన హెలికాప్టర్కు పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్ గీత, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, ఏఈఓ రఘు, సూపరింటెండెంట్ ఊడెపు రాజు, ఆర్ అండ్ బీ ఈఈ శంకరయ్య, వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.