హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి బస్పాస్లకు రాయితీల ఖర్చు రీయింబర్స్మెంట్ కోసం రూ.212.50 కోట్లను విడుదల చేసే దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. రవాణాశాఖకు సంబంధించి మూడో త్రైమాసికానికి సంబంధించిన రూ.162.50 కోట్లు విడుదల చేస్తూ మరోక దస్త్రంపై సంతకాలు చేశారు. అదే విధంగా హెడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి లక్ష రూపాయలు మెడిక్లెయిమ్ మంజూరు చేస్తూ మూడో ఫైల్పై సంతకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పొన్నం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తుందని, ఇదే స్పూర్తితో మిగతా గ్యారెంటీలను ప్రాధాన్య క్రమంలో తప్పక అమలు చేస్తామని స్పష్టంచేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పొన్నం ప్రభాకర్కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బుర్రా వెంకటేశం, వాణీప్రసాద్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.