హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET) 2021 అడ్మిషన్ కౌన్సెలింగ్ రేపటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం, రాష్ట్రవ్యాప్తంగా 119 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 28,814 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో 16,710 ప్రైవేట్ అన్ ఎయిడెడ్, 11,874 ప్రభుత్వ, 230 సీట్లు ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్నాయి.
TS POLYCET 2021 మొదటి దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాథమిక సమాచారం ఆన్లైన్లో ఫిల్ చేయడం ద్వారా ప్రారంభమౌతుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ ధృవీకరణ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఆగస్టు 5 నుండి 9 వరకు కొనసాగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 6 నుండి 10వ తేదీ వరకు జరగనుంది. విద్యార్థులు ఆగస్టు 6 నుండి 12 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. ఆగస్టు 16న సీట్ల కేటాయింపు జరగనుంది.
టీఎస్ పాలిసెట్ 2021 కన్వీనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. మెరుగైన కోర్సు, కాలేజీ కోసం విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాల కోసం https://tspolycet.nic.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల సమస్య పరిష్కారమైంది. గురువారం నుండి ప్రారంభమయ్యే అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ కాలేజీ భాగం కానుంది. కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే నాలుగు విభాగాలలో ఈ కాలేజీ ప్రవేశాలను కలిగి ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు అయిన కంప్యూటర్ సైన్స్ మినహా, ఇతర కోర్సులు ఎయిడెడ్ చేయబడతాయి. ఈ డిప్లొమా కోర్సులలో 230 సీట్లు ఉంటాయని అధికారులు బుధవారం తెలిపారు.