హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల యజమానులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్యాన్ని నియంత్రించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కృష్ణ త్రివేది సూచించారు. ఆ ఫ్యాక్టరీలు పర్యావరణ మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించారు. పర్యావరణ కాలుష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమల్లో పాటించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పాతటైర్ల నుంచి నూనె తీసే పరిశ్రమలు 47 ఉన్నాయని, వీటిలో 24 సంగారెడ్డి, 9 నల్లగొండ జిల్లాల్లో ఉన్నట్టు చెప్పారు. వీటిపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలిపారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు జవహర్లాల్, ప్రసన్నరాణి, నరేందర్తోపాటు 47 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.