హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అదనపు ఏర్పాట్లు చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. ఇప్పటికే ఎండలో ప్రచారం తమకు సవాలుగా మారగా.. పోలింగ్ రోజున ఓటర్లను తరలించడం మరో సవాలుగా మారే అవకాశమున్నది. ఇప్పుడే పలు పట్టణాలు, నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుండటుండగా.. పోలింగ్ జరుగనున్న మే 13న ఎండ తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతుందేమోనని, అలా తగ్గితే ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రితంసారి 2019లో ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు జరుగగా, అంతకు నాలుగు నెలల ముందు జరిగిన అసెంబ్లీ పోలింగ్ కంటే తొమ్మిది శాతం తక్కువగా నమోదైంది.
ఈ సారి మరో నెల రోజులు ఆలస్యంగా పోలింగ్ జరుగనుండగా.. ఆ సమయానికి ఎండల తీవ్రత పెరిగే అవకాశ ఉన్నదని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జారీచేసిన మూడు విడత ఎన్నికల నోటిఫికేషన్లలో ఈశాన్య రాష్ర్టాలు మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ఉంటుందని, దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా ఉండటాన్ని ఆయా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇతర రాష్ర్టాలలాగా తెలంగాణలో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని కోరుతున్నాయి. పోలింగ్ సమయాన్ని పెంచడం వల్ల మాత్రమే ఓటింగ్ శాతాన్ని పెంచగలమని సూచిస్తున్నాయి. ఇప్పటికే శీతాకాలంలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నగరాల్లో పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైందని, ఎండల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా తగ్గే అవకాశమున్నదని హెచ్చరిస్తున్నాయి. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ సమయాన్ని పొడిగించాలని కోరుతున్నాయి.
వేసవిలో పోలింగ్కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా కేంద్రాల వద్ద టెంట్లు, షేడ్నెట్, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. క్యూలైన్లు పెద్దగా ఉండేచోట ఓటర్లు అలసిపోకుండా కుర్చీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు పెడస్టల్ ఫ్యాన్లు, పెద్ద ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గతంలో ఏర్పాటుచేసిన విధంగా తాగునీరు, మూత్రశాలలు, ర్యాంప్, వీల్చైర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 60 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ర్టానికి చేరాయి. త్వరలోనే మరో 100 కంపెనీలు రాష్ర్టానికి రానున్నాయి. సమీప రాష్ర్టాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పించేందుకు ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.