పాలమూరు/ఇందల్వాయి/ నిజాంసాగర్/ కందుకూరు/రామారెడ్డి, మే 13: సమస్యలు పరిష్కరించాలని పలు గ్రామాలు ప్రజలు సోమవారం లోక్సభ ఎన్నికలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బ్యాటరీ కంపెనీ ఏర్పాటుతో తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, పనులు నిలిపివేయాలని నాలుగు గ్రామాల ప్రజలు, తమ గ్రామ పరిధిలో కాకుండా వేరే చోట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని కొందరు, తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం, కనీస వసతలు లేవని మరికొందరు, కాంగ్రెస్ నాయకుడు కించపరిచాడని మహిళలు ఇలా పలు కారణాలతో ప్రజలు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను మధ్యాహ్నం వరకు బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఓటు వేయడానికి అంగీకరించారు. వివరాల్లోకి వెళ్తే… మహబూబ్నగర్ జిల్లాకు సమీపంలో నిర్మిస్తున్న అమర్రాజ బ్యాటరీ కంపెనీ పనులు నిలిపివేయాలని ఎదిర, దివిటిపల్లి, అంబటిపల్లి, సిద్దాయపల్లివాసులు పోలింగ్ను బహిష్కరించారు.
బ్యాటరీ కంపెనీతో తమ ప్రాణాలకే ప్రమాదం ఉన్నదని, పనులు నిలిపివేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్దిచెప్పడంతో 3,299 మందికి130మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చీమలవాణి కుంట గ్రామం, రాచులూరు పరిధిలో ఉండగా తిమ్మాపూరులో పోలింగ్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేశారని, తాము ఓటు వేయబోమని 400మంది గ్రామస్థులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మహేశ్వరం ఏసీపీ, కందుకూరు సీఐ మక్బూల్ జాని ఓటు వేయాల్సిందిగా చీమలవాణి కుంటవాసులకు విన్నవించారు. అయిన గ్రామస్తులు పట్టుపట్టి అక్కడే బైఠాయించారు. దీంతో అర్జున అవార్డుగ్రహీత వెదిరె రవికాంత్రెడ్డి పోలీసులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడి మరో ఎన్నికల్లోపు గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఓటు వేయడానికి అంగీకరించారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామపరిధిలోని రాంసాగర్తండాకు రోడ్డు సౌకర్యం లేదని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మధ్యాహ్నం వరకు పోలింగ్ బహిష్కరించారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు తండాకు చేరుకొని ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు పోలింగ్ కేంద్రానికి కదిలారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలంలోని పిప్పిరేగడి తండాలో తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై సుధాకర్, మండల నాయకులు అక్కడికి చేరుకొని తండావాసులను సముదాయించారు. కనీస వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు గంటల అనంతరం ఉదయం 11 గంటల తర్వాత ఓటు వేసేందుకు తండావాసులు తరలివచ్చారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్లోని కొంతమంది మహిళలు ఓటు వెయ్యబోమని కాలనీలో బైఠాయించారు. ఓటు వెయ్యకపోతే ఒరిగేదేమీలేదని కాంగ్రెస్ నాయకుడు తమను అవమానించాడని ఓ వర్గం మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మరోవర్గం కాంగ్రెస్ నాయకులు మహిళలను సముదాయించి ఓటు వేయించారు.