హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఒకేసారి విడుదల అవుతుందనుకొన్న రాజకీయ పార్టీలు, పరిశీలకుల అంచనాలను తారుమారు చేస్తూ ఎన్నికల కమిషన్ ఒక్క హిమాచల్కు మాత్రమే షెడ్యూల్ విడుదల చేసింది. దీనికిగల కారణాలు పెద్దగా అర్థం కాని బ్రహ్మపదార్థలేమీ లేవు. సాధారణంగా ఏవేని రెండు రాష్ర్టాల్లో ఆరు నెలలలోపు అసెంబ్లీ గడువు ముగిస్తే ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తూ వస్తున్నారు. గుజరాత్, హిమాచల్ రెండు రాష్ర్టాల అసెంబ్లీకి కేవలం 40 రోజుల వ్యవధితో పదవీకాలం ముగుస్తుంది.
అలాంటప్పుడు ఈ రెండింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ప్రతిపక్ష పార్టీలే కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ చైర్మన్ ఖురేషి కూడా తప్పుపడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత కీలకం. వీరిద్దరి సొంత రాష్ట్రం గుజరాతే కావడం వల్ల ఇక్కడ జరిగే ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. మరో కోణంలో చూస్తే 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు గుజరాత్లో జరిగే ఎన్నికలను సెమీఫైనల్స్గా అంచనా వేస్తున్నారు. అందుకే గుజరాత్ ఎన్నికల నిర్వహణకు తగినంత వ్యవధిని ఎన్నికల కమిషన్ పరోక్షంగా కల్పించింది? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హిమాచల్తో పాటు గుజరాత్కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు మరికొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు బీజేపీ ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఒకేసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఆ అవకాశం ఉండదు. ప్రచారానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలకు మధ్య వ్యవధి ఉండటం వల్ల హిమాచల్లో ప్రచారానికి వెళ్లిన నాయకులు తిరిగి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లడానికి వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గుజరాత్ కంటే హిమాచల్లో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు బీజేపీ అంచనా వేస్తున్నది. హిమాచల్లో నవంబర్ 12న పోలింగ్ తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ గుజరాత్ ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండాలన్నది కూడా బీజేపీ వ్యూహంగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత ఆరు నెలల్లో గుజరాత్కు రూ.80 వేల కోట్ల వరాలను కురిపించిన ప్రధాని మోదీ.. ఇటీవల రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించి రూ. 27,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అయితే, బీజేపీ షెడ్యూల్ ప్రకారం.. గుజరాత్లో మరో రూ. 10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఇతరత్రా హామీలు ప్రకటించాల్సి ఉన్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, ఆ హామీల ప్రకటన కుదరకపోవచ్చని, అందుకే ఈసీ ద్వారా షెడ్యూల్ విడుదలను అధికార బీజేపీ వాయిదా వేయించిందని అనుమానం వ్యక్తం అవుతున్నాయి.
హిమాచల్కు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించి, గుజరాత్కు ప్రకటించకపోవడం ఎన్నో ప్రశ్నలు, అనుమానాలకు తావిస్తున్నది. ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీల గడువు దాదాపుగా ఒకేసారి ముగుస్తున్నది. అలాంటప్పుడు ఏ ఉద్దేశంతో గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించకుండా ఈసీ వాయిదా వేసింది?
ఎస్వై ఖురేషీ, మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్
గుజరాత్లో ప్రధాని మోదీ మరికొన్ని భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడానికి, ఇంకొన్ని వరాలు కురిపించడానికి షెడ్యూల్ విడుదలను వాయిదా వేశారు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సినదేమీ లేదు. దీన్ని మేం ముందే గ్రహించాం.
జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి