ములుగు : సైబర్ నేరాల(Cyber Crime)ను అరికట్టేందుకు సత్వరమే పోలీసు యంత్రాంగం స్పందిస్తుండడంతో బాధితులకు ఊరట లభిస్తుంది. తాజాగా ములుగు జిల్లా(Mulugu District)లో ఓ బాధితుడు పోగొట్టుకున్న రూ. 99,999 ను 48 గంటల్లోనే పోలీసులు(Cyber Police) తిరిగి అప్పగించారు.
వివరాలు..ములుగు మండలం కాసిందేవపేట్ గ్రామానికి చెందన గుంటి శ్రీకాంత్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బోరబండ వీఆర్ నగర్లో నివాసం ఉంటున్నాడు. తన సెల్ఫోన్ సిమ్(Cell Phone Sim) పనిచేయడం లేదని కొత్త సిమ్ తీసుకున్న శ్రీకాంత్ అదే రోజు తన స్వగ్రామమైన కాసిoదేవపేటకు వెళ్లాడు. ఒకరోజు గడిచినా సిమ్ యాక్టివేషన్ కాకపోవడంతో ములుగులో ఉన్న సంబంధిత స్టోర్ కి వెళ్లి యాక్టివేషన్ చేయించుకున్నాడు.
కొద్ది సేపటికే తన అకౌంట్ నుంచి రూ. 99,999 ‘ బ్యాలన్స్ హీరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు బదిలీ అయినట్టు మెసేజ్ వచ్చింది . దీంతో కంగు తిన్న శ్రీకాంత్ వెంటనే ములుగు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు(Complaint) చేశాడు. స్పందించిన పోలీసులు బాధితుడి ఖాతాను ఫ్రీజ్(Account Freeze) చేసి విచారణ చేపట్టారు. జరిగిన మోసాన్ని సాంకేతిక పరిజ్ఞానం(Technical knowledge)తో తెలుసుకుని 48 గంటల్లోనే ఆ డబ్బును తిరిగి రాబట్టారు.
ఈ సందర్భంగా పోగొట్టుకున్న డబ్బును జిల్లా ఎస్పీ గౌస్ ఆలం చేతుల మీదుగా గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన ములుగు ఎస్ఐ పవన్ కుమార్, సైబర్ క్రైం టీం కానిస్టేబుళ్లు జహూర్,రహీంను ఎస్పీ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ అసంబంధిత లింక్ లను ఓపెన్ చేయవద్దని, ఎవరైనా ఎక్కువ డబ్బులు ఆశ చూపి వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే తక్షణమే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.