హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని రైల్వే, బస్స్టేషన్ల నుంచి మహిళలు రాత్రి వేళలో క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు ట్రాకింగ్ కలిగిన, సురక్షితమైన ప్రజారవాణాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెలుపల రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సురక్షితమైన ప్రజారవాణా సౌకర్యం కల్పించాలని శుక్రవారం హర్షిత అనే నెటిజెన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ను అభ్యర్థించారు.
హర్షిత ట్వీట్కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ గారు.. హర్షిత అభ్యర్థనను త్వరగా పరిశీలించి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే, బస్టాండ్లలో అటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మంచి సూచన చేసినందుకు హర్షిత గారికి ధన్యవాదాలు’ అంటూ డీజీపీని ట్యాగ్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్కు స్పందించిన డీజీపీ.. ‘తప్పకుండా సర్.. ట్రాకింగ్ మెకానిజంతోపాటు మహిళలకు సురక్షితమైన రవాణాను అం దించడానికి ఇది గొప్ప చొరవ అవుతుంది. మేము దీన్ని అమలు చేయడానికి సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తాం’ అంటూ రీట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇదొక మంచి చర్య అని నెటిజన్లు లైకులు, కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.