ఎల్కతుర్తి, నవంబర్ 3: కూతురు గెంటేయ డంతో నిలువ నీడ లేకుండాపోయింది. బస్షెల్టరే ఆవాసంగా మారింది. ఎండయినా, వానయినా అక్కడే జీవనం సాగిస్తున్నది. ఇదీ 70 ఏండ్ల గొర్రె మార్త దీనస్థితి. ఆమె దుస్థితిని తెలుసుకుని పోలీసులు చలించారు. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్ ఆమెకు ఇల్లు కట్టించేందుకు ముందుకొచ్చారు. ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన మార్తకు కూతురు కమల ఉన్నది. తల్లి పేరు మీద ఉన్న రెండెకరాల భూమితోపాటు ఇంటిని కమల అమ్ముకున్నది. ఆ తర్వాత ఆమెను బయటకు గెంటేసింది.
కొన్నాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నా డబ్బులు చెల్లించకపోవడం తో మళ్లీ వీధిన పడింది. ఆరు నెలలుగా ఇందిరానగర్ వద్ద నేషనల్ హైవే పక్కనే ఉన్న బస్షెల్టర్లోనే ఉంటున్నది. ఈమెకు ఆసరా పెన్షన్ బాసటగా నిలిచింది. వృద్ధురాలి దుస్థితిని తెలుసుకున్న పోలీసులు గురువారం ఆమె దగ్గరికి వచ్చి ఇల్లు కట్టించేందుకు హామీ ఇచ్చారు. స్థానికురాలు పుష్పలీల తన ఇంటి ముందున్న స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రాగా ఇంటి నిర్మాణానికి ఏసీపీ శ్రీనివాస్ భూమిపూజ చేశారు.