SSC Paper Leak |వరంగల్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టెన్త్ హిందీపేపర్ లీకేజీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో పాత్ర ఉన్న అందరినీ దశలవారీగా విచారించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. టెన్త్ హిందీపరీక్ష జరుగుతున్న సమయంలోనే పేపర్ ఫొటోను వాట్సాప్లో రిసీవ్ చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా, ఈ నెల 10న హాజరవుతానని ఆయన సమాచారం ఇచ్చారు. ఈటల పీఏలు పెండ్యాల రాజు, ఎదులాపురం నరేందర్ శుక్రవారం విచారణకు వచ్చారు. వరంగల్ సెంట్రల్జోన్ డీసీపీ ఆఫీసులో వీరిని విచారించారు. టెన్త్ హిందీపేపర్ ఫొటోలు మీకు ఎలా వచ్చాయి? ఎంతమందికి పంపారని పోలీసులు ప్రశ్నించారు. ఫొటోలు తమకు వాట్సాప్లో వచ్చాయని, వాటిని తమ సారుకు చూపించామని చెప్పారు. పీఏలిద్దరి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంటకు చెందిన రాజు, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురానికి చెందిన నరేందర్ ఫోన్ల నుంచి మరికొంత మందికి ఫార్వార్డ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఫోన్లలోని వివరాల ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. టెన్త్ హిందీపేపర్ ఫొటోలను ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేసిన వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు 8 మందికి కూడా నోటీసులు ఇచ్చారు.
వాట్సాప్ గ్రూపులపై ఫోకస్
టెన్త్ పేపరు లీకు కేసులో కీలకంగా ఉన్న బూరం ప్రశాంత్ తనకు వచ్చిన పేపరు ఫొటోను బండి సంజయ్, ఈటల రాజేందర్తో పాటు మీడియా, బీజేపీ వాళ్లు ఉన్న వందల వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేశాడు. ప్రశాంత్కు పేపరు ఫొటోను పంపిన వ్యక్తి 2019-20 వాట్సాప్ గ్రూపులో ఉన్నాడు. పోలీసులు ఈ వాట్సాప్ గ్రూపుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ గ్రూపు నుంచి ఫార్వార్డ్ చేసిన ప్రతి ఒక్కరినీ విచారించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.