హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరమని డీజీపీ అంజనీకుమార్ కొనియాడారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల స్థూపం వద్ద డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. దేశరక్షణ కోసం ఎందరో పోలీసులు త్యాగాలు చేశారని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మం ది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. గొప్ప త్యాగాల నుంచే అద్భుత విజయాలు ఉద్భవిస్తాయని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ఎన్నో పోలీస్ సేవలకు తెలంగాణ పోలీసులే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్, జాబ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్లలో రాష్ట్ర పోలీస్ విభాగం నాలుగేండ్లుగా దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని తెలిపారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్) అమలులో 99 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్టు చెప్పారు.
దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరాల వ్యవస్థ మన రాష్ట్రంలో ఉన్నదని, దాంతో ఎన్నో నేరాలను పరిష్కరించేందుకు వీలు దొరుకుతుందని చెప్పారు. తెలంగాణ షీటీమ్స్, భరోసా సెంట ర్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. నూతన పోలీస్ సంస్కరణల వల్ల రాష్ట్రంలో క్రైమ్రేట్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడుతున్న అన్ని విభాగాల పోలీసులకు డీజీపీ సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీస్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్, నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, జాతీయ భద్రతా మాజీ సలహాదారు ఎన్కే నారాయణన్, అడిషనల్ డీజీలు సౌమ్యా మిశ్రా, శివధర్రెడ్డి, సంజయ్ కుమార్జైన్, అనిల్కుమార్, మహేశ్ భాగవత్, శ్రీనివాసరెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ అమరుల కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.