హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యాలయాల భవన నిర్మాణాల్లో నాణ్యత మరింత పెంచాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డ్ అభిప్రాయపడింది. క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్ట పర్చాలని, అకౌంట్స్ను మరింత పకాగా నిర్వహించాలని, దీనికోసం ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మంగళవారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ కోలేటి దామోదర్ అధ్యక్షతన బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. డీజీపీ అంజనీకుమార్, హోంశాఖ ము ఖ్య కార్యదర్శి జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఫైనాన్స్, అకౌంట్స్ విభాగానికి సీనియర్ అధికారిని డిప్యుటేషన్ పద్ధతిపై నియమించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచించారు.
రాష్ట్రంలో చోరీకి గురైన ఫోన్లను గుర్తించేందుకు పది రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నట్టు డీజీపీ పేర్కొన్నారు. క్రైమ్ రివ్యూ మీటింగ్లో పలు విషయాలు వెల్లడించారు. ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్)’ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దీంతో చోరీ అయిన ఫోన్ నంబర్లు, ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయవచ్చని అన్నారు. ఇందుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. నేరాలను అదుపు చేయడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.