Seethakka | మంగపేట, మే 23: ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా గురువారం జరిగిన మంత్రి సీతక్క పర్యటనలో పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో ఆటో ముందు అద్దాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టొద్దని అడ్డుపడేందుకు వెళ్దామనుకుంటే అద్దంపై పడే దెబ్బ తమ ఒంటిపై పడుతుందనే భయంతో మిన్నకుండిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.
మంత్రి వచ్చే దారిలో రోడ్డు పక్కన భక్తులను తీసుకువచ్చిన ఆటోలు నిలిపి ఉన్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలను తీయాలని చెప్పకుండా మంత్రి కాన్వాయ్కి ఆటోలు అడ్డంగా ఉన్నాయనే కారణంతో లాఠీలతో ఆటోల అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో డ్రైవర్లు చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయారు. అద్దాలు పగిలిపోవడంతో ఆటోను నడిపే వీలు లేక రోజంతా రోడ్డు పక్కనే ఉంచారు. విషయం తెలిసి కూడా మంత్రి సీతక్క పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్లు తమ బాధను ఎవరికి చెప్పుకోలేక తెలియక మౌనంగా ఉండిపోయారు. పోలీసుల తీరుపై మల్లూరుకు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.